– సామాజిక సమానత్వ సందేశాన్నిచ్చిన గొప్పనటుడు : ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి, సినీనటుడు దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. సోమవారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ (ఆర్బీసీసీ)లో స్వర్గీయ ఎన్టి రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కుమార్తెలు లోకేశ్వరి, పురందేశ్వరి, భూవనేశ్వరి, కుమారులు మోహన్ కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ తదితరులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన స్మారక నాణెన్ని(రూ.100) విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టి రామారావు తన నటనతో సామాన్యుల బాధనూ
వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు. ‘మనుషులంతా ఒక్కటే’ అంటే మనుషులంతా సమానమే అనే సినిమాతో సామాజిక న్యాయం, సమానత్వమనే సందేశాన్ని వినిపించారు. ప్రజాసేవకుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్కు ఉన్న ఆదరణ అంతే స్థాయిలో ఉందని రాష్ట్రపతి అన్నారు. ఆయన తన అసాధారణ వ్యక్తిత్వం, కృషితో దేశ రాజకీయాల్లో అద్వితీయమైన అధ్యాయాన్ని సృష్టించారు. ఆయన ప్రారంభించిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నేటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖను రాష్ట్రపతి అభినందించారు. ఆయన అద్వితీయమైన వ్యక్తిత్వం ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ముద్రితమై ఉంటుందని ఆమె అన్నారు. ఎన్టీఆర్ తెలుగు సినిమాలతో భారతీయ సినిమా, సంస్కృతిని సుసంపన్నం చేశారన్నారు. ఆయన తన నటనతో రామాయణం, మహాభారతాలలోని ప్రముఖ పాత్రలకు ప్రాణం పోశారు. ఆయన పోషించిన రాముడు, కృష్ణుడు పాత్రలు ఎంత సజీవంగా మారాయంటే జనాలు ఎన్టీఆర్ను ఆరాధించడం మొదలుపెట్టారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీలు రఘురామ కృష్ణరాజు, కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు హాజరయ్యారు. యువగళం పాదయాత్రలో ఉన్నందున లోకేష్, అలాగే ఇతర కారణాలతో ఆయన భార్యా బ్రహ్మణి, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు గైర్హజరు అయ్యారు.
ఆన్లైన్ వెబ్సైట్లో నాణెం
స్వర్గీయ ఎన్టి రామారావు స్మారక నాణెం ఆన్లైన్ వెబ్సైట్లో లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ విఎన్ఆర్ నాయుడు ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేసిన ఎన్టీఆర్ స్మారక నాణెం హైదరాబాదులోని మింట్ కార్యాలయంలో కూడా దొరుకుతుందన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణేం 12 వేల కాయిన్స్ ఇప్పటి వరకు ముద్రణ వేశామని చెప్పారు. రూ.100 నాణేంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్తో తయారుచేసినట్టు వెల్లడించారు. రూ.100 తయారు చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. హైదరాబాద్ మింట్లో మొదటిసారిగా ఎన్టీఆర్ స్మారక నాణాన్ని తయారు చేసినట్టు విఎన్ఆర్ నాయుడు తెలిపారు.