మణిపూర్‌ ఘటనలపై నిరసన

– కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- విలేకరులు
మణిఫూర్‌ రాష్ట్రంలో అమానుష ఘటనలపై సోమవారం కూడా పలు జిల్లాల్లో సీపీఐ(ఎం), ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. మహిళలు, క్రైస్తవులపై దాడులను నేతలు ఖండించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఆలేరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. చౌటుప్పల్‌ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ మాట్లాడారు. వలిగొండలో నల్లబ్యానర్‌ పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. భువనగిరి హనుమపురం, వడపర్తి గ్రామం ప్రధాన చౌరస్తాలో ధర్నా చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీలో ఐద్వా ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన తెలిపారు.
నల్లగొండ జిల్లాలోని నాంపల్లి మండలంలో ఫాస్టర్స్‌ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మణిపూర్‌ రాష్ట్రంలో క్రైస్తవులపై దాడిని ఖండిస్తూ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో సిర్పూరు నియోజకవర్గ ఫాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో క్యాండిల్స్‌తో నిరసన తెలిపారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో గోండ్వానా గణతంత్య్ర పార్టీ, ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌక్‌లో రాస్తారోకో చేశారు.