15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

– కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మెన్‌ అన్వేష్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 15న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మెన్‌ సుంకేట అన్వేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. తడిసిన ధాన్యాని కొనుగోలు చేయాలని ఒక ప్రకటనలో ఆయన డిమాండ్‌ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మొదట్లో రూ. 2200 పలికిన మొక్కజొన్నను ఇప్పుడు దళారులు రూ.1,400 కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. తూకం వేయగానే రైతుకు ట్రాక్‌ షీట్‌ ఇవ్వాలని కోరారు. మిల్లర్లతో రైతులకు ఎటువంటి సంబంధం ఉండకూడదని సూచించారు. మక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రుణాలను రీషేడ్యుల్‌ చేయడంతో వెంటనే రుణమాఫీ చేయాలని కోరారు.