న్యూఢిల్లీ : ‘మోడీ’ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేశారన్న కేసులో లోక్సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. దీంతో ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్నారు. కాగా, తాజాగా రక్షణశాఖపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రాహుల్ ఎంపికయ్యారు. మార్చి నెలలో సభ్యత్వం కోల్పోకముందు కూడా రాహుల్ ఈ కమిటీలోనే సభ్యుడిగా ఉన్నారు. ఇందులోకి కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ కూడా నామినేట్ అయినట్లు లోక్సభ బులిటెన్ వెల్లడించింది.
లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఆమ్ఆద్మీ తరఫు ఎంపీ సుశీల్ కుమార్ రింకూ.. వ్యవసాయం, పశుసంవర్ధక, ఫుడ్ ప్రాసెసింగ్ స్టాండింగ్ కమిటీకి ఎంపికయ్యారు. ఇటీవల జలంధర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో రింకూ ఎన్నికయ్యారు. ఇక మార్చి నెలలో లోక్సభ సభ్యత్వం తిరిగి పొందిన ఎన్సీపీ ఎంపీ ఫైజల్ మొహమ్మద్.. వినియోగదారుల వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయ్యారు.
2019లో మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడటంతో ఈ ఏడాది మార్చి 24న రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే, ఆయనకు దిగువస్థాయి కోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రాహుల్ సభ్యత్వాన్ని ఈ నెల 7న పునరుద్ధరించారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని.. అవిశ్వాస తీర్మానంపై రాహుల్ ప్రసంగించారు.