జైపూర్: వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు. వాతావరణ మార్పులతో ఎండలు మండిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకుంది. ముఖ్యంగా రాజస్థాన్లోని ఎడారి ప్రాంతమైన జైసల్మేర్లో శనివారం రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల సెల్సీయస్ నమోదయింది. సెప్టెంబర్ నెలలో ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం గత 74 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. సాధారణ ఉష్ణోగ్రతలకు ఇది 6.9 డిగ్రీలు అధికం.జైసల్మేర్లో 1949, సెప్టెంబర్ 10న 43.3 డ్రిగీలు రికార్డయింది. ఎడారిలోని పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీచాయని అధికారులు ఆదివారం తెలిపారు. బర్మేర్లో 40.3 డిగ్రీలు, బికనేర్లో 40 డిగ్రీలు, జోధ్పూర్లో 39.5 డిగ్రీలు, జాలోర్లో 38.7 డిగ్రీలు, గంగానగర్లో 38.5 డిగ్రీలు, ఇక జైపూర్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నెలలు కూడా రాష్ట్రంలో ఇదే విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని అధికారులు చెప్పారు.