– కేంద్ర మంత్రులు, రైల్వే బోర్డు ఛైర్మన్ కు జర్నలిస్ట్ సంఘాల వినతి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్లను పునరుద్ధరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ ప్రధాన కార్యదర్శి విపిన్ దులియా, కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఐఎఫ్డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సభ్యులు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తదితరులు శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రైల్వే బోర్డు చైర్మెన్ జయవర్మ సిన్హాలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో చాలా ఏండ్లుగా ఇస్తున్న రాయితీని కరోనా నేపథ్యంలో గత మూడేండ్లుగా కేంద్రం నిలిపివేసిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల దేశవ్యాప్తంగా జర్నలిస్టులు వృత్తిపరమైన విధి నిర్వహణలో రైలు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయమై గతంలో పలు మార్లు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రైల్వే పాస్లను పునరుద్ధరించి జర్నలిస్టులకు రైలు ప్రయాణం భారం కాకుండా చూడాలని కోరారు. అలాగే ఎంపీలు బండి సంజరు, కె. లక్ష్మణ్ లను కలిపి జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల పునరుద్ధరణ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్ళాలని కోరారు. జర్నలిస్టుల పెన్షన్ స్కీమ్, జర్నలిస్టుల రక్షణ చట్టం తదితర అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషిచేయాలనికషి చేయాలని ఎంపీలను విజ్ఞప్తి చేశారు.