విప్లవ వీరులకు వందనం

– భగత్‌ సింగ్‌కు సీపీఐ(ఎం) నేతల ఘన నివాళి
న్యూఢిల్లీ : స్వాతంత్ర సమరయోధులు, యువ విప్లవ వీరులు భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు సీపీఐ(ఎం) ఘన నివాళి అర్పించింది. ఈ మేరకు షహీద్‌ దివస్‌ సందర్భంగా గురువారం నాడిక్కడ భగత్‌ సింగ్‌ రోడ్డులోని భగత్‌ సింగ్‌ విగ్రహానికి పూలతో పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌, సుభాషిణీ అలీ, తపన్‌ సేన్‌, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.అరుణ్‌ కుమార్‌, మురళీధరన్‌, రాజేంద్ర శర్మ, కేంద్ర కమిటీ సభ్యులు ఎఆర్‌ సింధూ, ఏఐకేఎస్‌ కోశాధికారి కృష్ణప్రసాద్‌ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరులు భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను స్మరించుకున్నారు. సుభాషిణీ అలీ, తపన్‌సేన్‌ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యువ కిశోరాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. డీవైఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక హరి కిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో మెడికల్‌ క్యాంప్‌ను డీవైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఎఎ రహీమ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళుర్పించారు.