నేడు ఆర్బీఐ సమీక్ష నిర్ణయాల వెల్లడి
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్షాలో వడ్డీ రేట్లు యథాతథంగా ప్రకటించవచ్చనే అంచనాల్లో బుధవారం స్టాక్ మార్కెట్లకు మద్దతు లభించింది. రిలయన్స్ ఇండిస్టీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్ల మద్దతుతో బీఎస్ఈ సెనెక్స్ 350 పాయింట్లు లేదా 0.56 శాతం పెరిగి 63,143కు చేరింది. ఈ ఏడాదిలో ఈ మార్క్ను చేరడం తొలిసారి. ఇంతక్రితం 2022 నవంబర్లో 63వేల మైలురాయిని నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత కొద్ది కాలం సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. తాజా సెషన్లో ఎన్ఎస్ఈ నిఫ్టీ 127 పాయింట్లు రాణించి 18,726 వద్ద ముగిసింది. మూడు రోజల పాటు సాగుతున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా గురువారం (నేటి)తో ముగియనుంది. ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో ఈ భేటీలో వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని నింపాయని బ్రోకర్లు పేర్కొన్నారు. గత ఏప్రిల్లో జరిగిన సమీక్షీలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచగా.. అంతక్రితం 2022 మే నుంచి వరుసగా రెపోరేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రుణ గ్రహీతలపై అదనంగా 2.5 శాతం వడ్డీ భారం పడింది. తాజా భేటీలోనూ ఉపశమనం లభించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్-30లో నెస్ల్టే, టాటా స్టీల్, టాటా మోటార్స్ సూచీలు అధికంగా 2-3 శాతం పెరిగాయి. పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి