ఫైళ్లు సమర్పించండి

– రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మల్లన్నసాగర్‌ నిర్వాసితుల కోసం సిద్ధిపేట జిల్లా ముట్రాజ్‌పల్లిలో భూసేకరణకు సంబంధించి గెజిట్‌ సవరణ నోటిఫికేషన్‌కు చెందిన ఫైళ్లను సమర్పించాలని హైకోర్టు రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ కోసం 102 ఎకరాల సేకరణ నిమిత్తం 2021, జనవరి 31న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను బాలాజీ స్పిన్నర్స్‌ సవాల్‌ చేసిన రిట్‌ను సింగిల్‌ జడ్జి డిస్మిస్‌ చేయడంతో అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ డివిజన్‌ బెంచ్‌ విచారించింది. నోటిఫికేషన్‌ పబ్లిష్‌కు చెందిన పత్రాలు అందజేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.