నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
ఉద్యోగం రాదనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ రూరల్ మండలం హచ్యుతాండ గ్రామపంచాయతీ పరిధిలోని బొత్తల తండాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గుగులోత్ యాకోబు-బుజ్జిల కుమారుడు రాజకుమార్ (26) ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. రాజకుమార్ మండల పరిధిలోని శారద స్కూల్లో పదో తరగతిలో 10/10, ఇంటర్లో 989 మార్కులు, బీటెక్ సివిల్ ఇంజినీర్లో 85% సాధించాడు. 2020 నుంచి ఫ్రెండ్స్తో ఉంటూ ఏఈఈ, గ్రూప్-2 మరియు 4కు ప్రిపేర్ అయ్యాడు. ఏఈఈ పేపర్ లీకేజ్ కావడం, గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటంతో ఆందోళనకు గురయ్యాడు. ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా ఉద్యోగం వస్తుందోరాదోనని ఆందోళనకు గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తమ కొడుకు మృతికి ప్రభుత్వమే కారణమని తండ్రి యాకోబు ఆవేదన వ్యక్తం చేశాడు.