ప్రతిరోజు ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏఎన్ఎం ఎర్ర సునీతకు జిల్లాస్థాయి ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. గురువారం జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కోహెడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బస్వాపూర్ హెల్త్ సబ్ సెంటర్లో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న సునీత ప్రతిరోజు గ్రామంలోని గర్భిణీలకు బాలింతలకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ అవసరమైన మాత్రలు అందజేస్తుది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రకాష్ సునీత సేవలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించగా సునిత సేవలను గుర్తించి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్జి, కలెక్టర్ మనుచౌదరి సునీతకు ఉత్తమ ఉద్యోగి అవార్డు అందజేసి అభినందించారు. డాక్టర్ నిమ్రా తరుణమ్, తోటి ఉద్యోగులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు.