తంగళ్ళపల్లి కిష్టమ్మగుట్టపై కొత్తరాతి యుగపు ఆనవాళ్లు

 పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి
నవతెలంగాణ-కోహెడ : కోహెడ మండలంలోని తంగళ్ళపల్లి గ్రామ శివారులోని కిష్టమ్మగుట్టపై కొత్త రాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూసాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఆదివారం గొట్లమిట్ట గ్రామానికి చెందిన చింతలపల్లి రవీందర్‌రెడ్డి గ్రామంలోని కాకతీయ కాలపు శిధిల శివాలయాన్ని పునరుద్ధరణ చేపట్టడానికి ఆహ్వానించగా తంగళ్ళపల్లి గుట్టపై జరిపిన అన్వేషణలో ఆదిమానవుని ఆనవాళ్లు కనిపించాయన్నారు.తంగళ్ళపల్లి నుండి కోహెడ మార్గంలోని కిష్టమ్మగుట్టపై గల వేణుగోపాల స్వామి ఆలయ మార్గంలో కుడివైపు గల రాతి పరుపుపై మూడు చోట్ల క్రీ.పూర్వం 4 వేల సంవత్సరాల క్రితం ఆనాటి మానవులు రాతి గొడ్డల్లను పదును పెట్టుకున్నప్పుడు ఏర్పడిన గుంతలు ఉన్నాయని, అవి 15 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, 3 నుంచి 6 సెంటీమీటర్ల వెడల్పు, 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతు ఉన్నాయని తెలిపారు. పరిసరాల్లోని రాతి ఆవాసాలు, నీటి వనరులు ఆనాటి మానవులు కిష్టమ్మగుట్టపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి సహాకరించాయన్నారు. ఇప్పటికి 6 వేల సంవత్సరాల నాటి ఆనవాళ్లను కాపాడుకొని, భవిష్యత్‌ తరాలకు అందించాలని గ్రామస్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనవెంట వట్టిపల్లి లింగారెడ్డి, బొలుమల్ల ఎల్లయ్య, మీసాల రాజయ్య, శిల్పి షేక్‌ రబ్బాని, ననువాల ప్రతాపరెడ్డి ఉన్నారు.