– సీఐఐ సమావేశంలో ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సాంకేతిక పరిజ్ఞానం నిజమైన గేమ్ ఛేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఓ హౌటల్ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం డిజిటలైజేషన్ అనేక రంగాల్లో విప్లవాత్మమైన మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. కరోనా తర్వాత మరింత పెరిగిందన్నారు. ఐటీరంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదనీ, ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఐటీ రంగం ముందుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని వివరించారు. రవాణా, దేవాదాయ, వాణిజ్య పన్నుల శాఖ, టీఎస్ఐపాస్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లాంటి ప్రభుత్వ శాఖలు పూర్తిగా డిజిటలైజ్ అయ్యాయని తెలిపారు. మీ సేవ ద్వారా 600 రకాలకు పైగా సేవలు ఆన్లైన్లో అందుతున్నాయని చెప్పారు. సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగంలో తెలంగాణ గత పది సంవత్సరాలుగా అసమాన ప్రతిభను కనపరుస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో విజయవంతంగా ముందుకు సాగుతుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కన్వీనర్ సంజీవ్ దేశ్ పాండే, కో కన్వీనర్ రామకష్ణ , బ్రాడ్గేజ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఎండీ శీనం ఓరి తదితరులు పాల్గొన్నారు.