– శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్
హైదరాబాద్ : పారా ఒలింపియన్లు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. పారా అథ్లెట్ల ప్రదర్శన ప్రతి క్రీడాకారుడికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా రవీంద్ర భారతిలో అంధ క్రికెటర్ల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘అంధత్వాన్ని లెక్క చేయకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించటం సాధారణ విషయం కాదు. పారా అథ్లెట్లకు సేవలు అందించడానికి క్రీడా శాఖలో ప్రత్యేక విభాగ కార్యాలయం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తాను’ అని ఆంజనేయ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, పారా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఇక, శనివారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ దినోత్సవం నాడు చేపట్టిన చలో మైదాన్ కార్యక్రమం పోస్టర్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్ ఆవిష్కరించారు.