రాష్ట్ర మత్స్యరంగం అభివృద్ధికి కేంద్రం సహకరించాలి

– కేంద్రమంత్రికి పిట్టల రవీందర్‌ వినతిపత్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధ్ధికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం కూడా తమ వంతు బాధ్యతగా సహాయ, సహకారాలందించాలని రాష్ట్ర ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌ కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన ముగించుకొని శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరే ముందు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పిట్టల రవీందర్‌ను ప్రత్యేకంగా కలుసుకొని చర్చించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ) ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు జరుపుతున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకంలో కనీసం 50 శాతం నిధులను సాంప్రదాయ మత్స్యకారుల సంక్షేమానికి వినియోగించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో రవీందర్‌ కోరారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో రాష్ట్రస్థాయి ఫిషరీస్‌ ఫెడరేషన్‌కు ప్రత్యేకంగా భాగస్వామ్యం కల్పించడంతోపాటు నేరుగా దరఖాస్తులను సిఫారసు చేసే వెసులుబాటును కలుగజేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎంపికయ్యే మత్స్య సహకార సంఘాలకు, వాటిలోని సభ్యులకు 60 శాతం సబ్సిడీని అందజేయాలని కూడా చైర్మెన్‌ కేంద్ర మంత్రిని కోరారు.
దేశవ్యాపితంగా చేపల వేటపై నిషేధం అమలుపరిచే 45 రోజుల కాలానికి ప్రతి మత్స్యకారునికి ప్రస్తుతం అందజేస్తున్న 4,500 జీవన భృతి మొత్తాన్ని రూ.తొమ్మిది వేలకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉపరితల జల వనరుల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలుస్తున్నదని, అందువల్ల ఉపరితల జనవనరుల చేపల పెంపకంలో పరిశోధనలు నిర్వహించే – సిఐఎఫ్‌ఆర్‌ఐ- సెంటర్‌ ఫర్‌ ఇన్‌ ల్యాండ్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ సంస్థకు సంబంధించిన ప్రాంతీయ విభాగాన్ని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర మంత్రికి సూచించారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.