లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

– ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నేడు, రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. లీకేజీపై సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. లీకేజీకి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేయాలని సూచించారు. లీకేజీకి కారణమైన కమిషన్‌ ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.