”మానవ సంస్కతి వికాసానికి భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ లేదా అసమ్మతి కారణం. ప్రపంచంలోని జ్ఞానం ప్రశ్నించకుండా అభివద్ధి చెందదు. ఆధునిక సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉండటం, పౌరులు అసమ్మతులు వ్యక్తపరచడం వారి వాక్స్వాతంత్రంలో తప్పనిసరిగా ఒక భాగం అయి ఉండాలి. ఈ హక్కు వివాదాస్పదమే అయినా సమాజాలు నిరంతరంగా కొనసాగాలంటే అత్యంత కీలకం” అని అంటారు ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా థాపర్.
మానవజాతి తన మనుగడ కోసం, తను జీవించడానికి ప్రభావితం చేసే అంశాల గురించి భిన్నాభిప్రాయాలను వ్యక్తపరచడం వల్లనే మానవ సంస్కతి, సమాజం అభివద్ధి కాగలిగింది. రాచరిక వ్యవస్థ, బానిస వ్యవస్థలు మారి లౌకికవాదం పెంపొందగలిగింది. అయితే ఈ ఆధిపత్యం తన రూపాన్ని మార్చుకుంది. ఉదారంగా ప్రజలకు కొన్ని హక్కులు, వెసులుబాటులు, ఇస్తూ ఆధిపత్య వర్గం తన ఆధిపత్యాన్ని, దోపిడీని చలాయిస్తుంది. చారిత్రాత్మకంగా ఈ ప్రశ్నించే తత్వం, ధిక్కారం ఉన్నాయి అనడానికి వలసవాదం నుండి విముక్తి అయిన దేశాలే ఉదాహరణలు. ఆధునిక పౌర సమాజం కూడా ఇదే ఘర్షణను అసమ్మతిని, ప్రశ్నించే హక్కును కాపాడుకోవడానికి దినదిన సంఘర్షణలు పడవలసి వస్తుంది.
మార్కెట్ పై ఆధిపత్యం కోసం జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను రూపొందించడానికి దారితీశాయి. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం, రక్షణ కొరకు 1948, డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించి ప్రస్తుతం వజ్రోత్సవం జరుపుకుంటుంది. అయినా ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఈ హక్కుల కోసం పోరాటాలు సాగుతూనే ఉన్నాయి.
బంగ్లాదేశ్ లో సంవత్సర కాలం నుండి ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, అప్రజస్వామ్యానికి వ్యతిరేకంగా, పత్రిక స్వేచ్ఛను హరించడానికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, పారదర్శకమైన ఎన్నికల కోసం జరుగుతున్న సమ్మెలో పోరాటాలలో ముగ్గురు ఉద్యమకారులు ఒక పోలీసు మరణించారు. ఐర్లాండ్లో దాదాపు దాని జనాభాలో ఒక శాతంకు సమానంగా తరలివచ్చిన శరణార్థులను బహిష్కరించడం గురించి, స్థానిక ప్రజలకు నివాసాల ఏర్పాటు గురించి గత సంవత్సర కాలం నుండి ఆందోళనలు జరుగుతుంటే ఆ శరణార్థుల ఆశ్రయాల కోసం కూడా మరో ప్రక్క ఆందోళనలు జరుగుతున్నాయి.
ఇజ్రాయిల్, గాజాపై చేస్తున్న అమానవీయ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. స్వయంగా ఇజ్రాయిల్ ప్రజలే యుద్ధాన్ని ఆపాలి అంటూ తమ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలిపారు. నేతన్యాహు ప్రభుత్వం ఈ ఆందోళనలు చేస్తున్న మహమ్మద్ బరాక్ లాంటి ఉద్యమకారులను అక్రమంగా నిర్బంధించింది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పత్రికలను (Haaretz) రద్దు చేసింది.
ఇలా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం మనుగడ కోసం స్థానిక ప్రజల పోరాటాలు సాగుతున్న నేపథ్యంలో ఆందోళనకారులపై మానవ హక్కుల ఉద్యమకారులపై ప్రభుత్వం విరుచుకుని పడుతూనే ఉంది. ఇలా నిరంకుశంగా వ్యవహరించడంలో భారత ప్రభుత్వమూ తీసిపోలేదు.
గ్లోబల్ ఇండెక్స్ ర్యాంకింగ్లో ప్రపంచ సంతోష సూచికలో 126/146 వ స్థానంలోనూ, పత్రిక స్వేచ్ఛలో 161/180 వ స్థానంలోనూ, ప్రపంచ శాంతి సూచికలో 135/163 వ స్థానంలో, లింగ వివక్షతలో వ 135/146 స్థానంలో, ఆకలి సూచికలో 107/121 వ స్థానంలోనూ ఉన్నది.
స్వీడన్ కు చెందిన వీ- డెమ్ సంస్థ సర్వే ప్రకారం భారతదేశాన్ని ఎన్నికల నిరంకుశత్వం గల రాజ్యంగా వర్గీకరించింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం పై బహుళ కోణాల నుండి ఆంక్షలు విధించబడుతున్నాయి. బహుళ కోణాల నుండి అంటే కొన్ని ప్రజా సమూహాలపై వాక్స్వాతంత్ర నిర్బంధం జరుగుతుంది. మత రాజకీయాలు, కుల రాజకీయాలు పెరుగుతున్న పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. అభ్యుదయం, సైద్ధాంతికత్వంపై దాడులు జరుగుతున్నాయి.
జాతీయ హింస వ్యతిరేక ప్రచార సంస్థ (NCAT – National Campaign Against Torture) జూన్ 29, 2020లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2019లో రోజుకు ఐదుగురు చొప్పున 1731 పోలీస్ కస్టడీ మరణాలు సంభవించాయి. వీరంతా దుర్భలమైన వారు, దళితులు, ముస్లింలు, ఆదివాసీలు. సి.ఏ.ఏ, ఎన్.ఆర్.సి.కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ సందర్భంలో 2020లో జాతీయ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం (NCRB) మతపరమైన అల్లర్లలో 62 మంది చనిపోయారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై ఉపా చట్టంతో దేశద్రోహం కేసులు పెట్టడం, వారి నివాస ప్రాంతాలను, దుకాణాలను, ఆస్థులను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. మే 3, 2023లో మణిపూర్ లో మైతీ – కుకీలు (మెజారిటీ – మైనారిటీ) జాతుల మధ్య జరిగిన హింసలతో 175 మంది మరణించారు. 118 మంది గాయపడ్డారు. ఈ మారణకాండలో మైనారిటీ జాతికి చెందిన మహిళలను నగంగా ఊరేగించి, బలత్కరించి, హత్యగావించారు.
2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోయారు. ఈ మారణకాండలో మానవ హక్కులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ ఉద్యమించినందుకుగాను కేసులు, నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు.
గిరిజనుల రక్షణ, సంక్షేమం, అభివద్ధి కోసం గళమెత్తిన స్టాన్ స్వామినీ అక్రమ కేసులతో ప్రభుత్వం నిర్బంధించి జైల్లోనే ఆయన మరణానికి కారణమైంది. కులాంతర వివాహాలను ప్రోత్సహించిన ఉద్యమకారుడు గోవింద్ పన్సారే, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నరేంద్ర దబూల్కర్, కుల వ్యవస్థను ధిక్కరించిన గౌరీలంకేష్లు నిర్దాక్షిణ్యంగా కాల్చబడ్డారు. హత్రాస్ కేసులో నిజానిజాలు బయటకు తేవడానికి ప్రయత్నించిన పాత్రికేయుడు సిద్ధిఖ్ కప్పన్పై యూపీ ప్రభుత్వం దేశద్రోహ కేసు పెట్టి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించేలా చేసింది. డిజిటల్ మీడియా సంస్థ న్యూస్ క్లిక్ పై దాడి, దాని వ్యవస్థాపక సంపాదకులు ప్రబీర్ పురకాయస్థ అరెస్టు… ఇలా అనేక నిర్బంధాల ఉదాహరణలు చూడవచ్చు.
ఈ విధంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై నిర్బంధాలను ప్రయోగించడంలో రాజ్యం, ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పోరాటం జరుగుతున్న ప్రాంతాలను చీకటి మయం చేస్తూ ప్రపంచానికి ఏమీ తెలియకుండా దూరం చేసి, ఇంటర్నెట్లు, విద్యుత్తు ఆపివేసి, మీడియాని నియంత్రించి, అన్ని రకాల నిర్బంధాలను ప్రయోగిస్తుంది. పై ఉదాహరణలన్నీ మానవహక్కుల హననం ఏ విధంగా జరుగుతున్నాయో తెలియజేస్తున్నాయి.
మానవ జీవితం పవిత్రమైనదని ఒక్కోమతంలో ఒక్కో రకంగా మత నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి. కొన్ని మతాలు అయితే పునర్జన్మను కూడా విశ్వసిస్తాయి. కానీ ఆధునిక మానవ హక్కులు మానవతావాదంతో కాపాడబడతాయి. జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. చరిత్రను చూస్తే గతంలో కొందరికే ఉన్న ఓటు హక్కు, ఆస్థి హక్కు పోరాటాలతోనే అందరికీ సాధించబడ్డాయి. యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయిన వారి తల్లులు, భార్యలు, ఆడపడుచులు ధిక్కరించటంతో శాంతి ఒప్పందాలు చేసుకోవలసి వచ్చింది. తన ఆయుధాలను అమ్ముకోవడానికి యుద్ధాలను ప్రేరేపిస్తున్న సామ్రాజ్యవాద అమెరికాను ప్రపంచం దోషిగా చూస్తున్న సమయంలో, దానికి తలవంచుతున్న దేశాల వైపు ప్రజలు ప్రజా పోరాటాలతో వేలెత్తి చూపాలి. ఆధిపత్యం కోసం మగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న వారిని వెలివేయాలి. రోజాలగ్జంబర్గ్ అన్నట్టు ”ఏం జరుగుతూ ఉన్నదో బిగ్గరగా చెప్పడమే ఎవరైనా, ఎప్పుడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన పని”, ఆ పనిని మానవతావాదులు చేయాలి. హక్కుల సాధనక, భద్రత కొరకు చరిత్ర చెప్పిన పాఠం పోరాటాలే శరణ్యం.
– యం.డి.షకీల బేగం (UTF)