
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బుధవారం పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన శివాజీ యూత్, అంబేద్కర్ యూత్,11 స్టార్ యూత్, ఫ్రెండ్స్ యూత్, శ్రీకృష్ణ యాదవ యూత్, రాయల్ యూత్ సభ్యులు, భీంగల్ పట్టణ నందిగల్లీ 3వ వార్డుకి చెందిన పలువురు యువకులు, బీజెపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, యువకులు మోర్తాడ్ మండలం పాలెం గ్రామం బీజేపీ పార్టీకి చెందిన యువకులు పెద్ద ఎత్తున సుమారు 300 మంది రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.
మంత్రి వేములకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు..
బాల్కొండ నియోజకవర్గ నలుమూలల అన్ని గ్రామాల నుండి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోంది. పలు కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గ చిందు కళాకారుల సంఘం, మోర్తాడ్ మండల ఆదర్శ మున్నూరు కాపు సంఘం ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అభివృద్ది ప్రదాత వేముల ప్రశాంత్ రెడ్డికే మా ఓటు అంటూ పలువరు సంఘ నేతలు, మహిళలు ముక్త కంఠంతో నినదించారు. అందుకు సంబంధించిన తీర్మాన పత్రాలు మంత్రికి అందజేశారు.పలు సంఘాలు తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల మంత్రి వేముల హర్షం వెలిబుచ్చారు. వారి అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.