
నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై సభలో టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సభా దృష్టికి తీసుకొచ్చారు.గత 25 రోజుల నుండి పంచాయతీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారని వారి యొక్క సమ్మె న్యాయమైందన్నారు. 1981లో సిరికోండ మండలంలోని చీమన్ పల్లి సర్పంచ్ చేసినప్పుడు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాలు 50, రూపాయల నుండి 100 రూపాయలు చెల్లించేవారని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మనసున్న మారాజని, పెద్ద మనసు చేసుకొని పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు 9,500 పెంచడం జరిగిందని చెప్పారు.రాష్ట్రంలో పల్లె ప్రగతి లో భాగంగా తడి, పొడి చెత్త వేరు చేస్తూ డంపింగ్ యార్డుల వద్ద చెత్తను వేయడానికి కార్మికులు గ్రామాలలో చాలా కష్టపడుతు న్నారని అన్నారు.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రెండు గ్రామాలు జాతీయ అవార్డులు పొందడం ఆనందంగా ఉందని దాని వెనుక కార్మికుల కష్టం కూడా ఉందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఇన్సూరెన్స్ కల్పించి జీతాలు పెంచాలని కార్మికుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సానుకూలంగా స్పందించి సమస్యను నోట్ చేసుకోవడం జరిగిందని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.