ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి డిమాండ్
– నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులు లో
నవతెలంగాణ- జమ్మికుంట
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను, వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. శనివారం రోజున హుజరాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులు  వాసుదేవ రెడ్డి ప్రారంభించి, మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల అనుసరిస్తూ కార్పొరేట్ల, సామ్రాజ్యవాదుల, భూస్వాముల కొమ్ముకాస్తూ, పేద బడుగు బలహీన వర్గాలను పూర్తిగా విస్మరించిందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలని తీసివేసిందని ఆయన దుయ్యబట్టారు. మతం పేరుతో మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ పబ్బంకడుక్కుంటుందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, మతం రంగు చుట్టూ రాజకీయాలను తిప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు .44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లను చేసిందని, కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థలను శరవేగంగా ప్రైవేటు వ్యక్తులకు పప్పు బెల్లాళ్ల కు అమ్ముతూ, తాకట్టు పెడుతూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధానాలు అనుసరిస్తుందని దుయ్యబట్టారు. రైతును భూమి నుండి వేరు చేసే కుట్రలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు . పాఠ్యాంశాలలో స్వతంత్ర సమరయోధుల చరిత్రలు లేకుండా చేస్తుందని, ప్రజలందరూ బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను గ్రహించాలని ఆయన తెలిపారు .రాష్ట్రంలో అధికారంలో ఉన్న బి ఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని అని విమర్శించారు. రెండు పడక గదుల ఇల్లు వెంటనే అరులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
     కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుకు నోచుకోలేదని, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు మీరు అందలేదని, మేనిఫెస్టోలో పెట్టి నేటికీ అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వేతనాలను సవరించి అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉప ఎన్నికల్లో బిజెపి టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ శిక్షణ తరగతుల్లో ప్రిన్సిపాల్ గా బాసిర సంపత్ రావు వ్యవహరించారు. రెండో పూట పార్టీ కార్యక్రమాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి బోధించారు.జనతా ప్రజాస్వామ్య విప్లవ లక్ష్యసాధనకు ప్రజా సంఘాలు ఆయా రంగాల ప్రజలను సమీకరించి పోరాటం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జమ్మికుంట జోన్ కార్యదర్శి శీలం అశోక్,హుజురాబాద్ జోన్ కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి, జోన్ కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, దండిగారి సతీష్, తిప్పర బోయిన శ్రీకాంత్, జక్కుల రమేష్, గుండేటి వాసుదేవ్, వడ్ల రాజు, యుగంధర్ రావుల ఓదెలు, రాజకుమారి, ఎల్లయ్య, సిరికొండ మదనయ్య, గడ్డం శోభన్, కన్నం సదానందం, దాసరి మొగిలి,ఇజిగిరి శ్రీకాంత్ రాచపల్లి తిరుపతి, పిల్లి రవి, దాసరపు మొండయ్య, లతోపాటు 80 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.