![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/IMG-20231009-WA0008-300x135.jpg)
– బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి
నవతెలంగాణ కమ్మర్ పల్లి : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి చీరలు, హెల్మెట్ల పంపిణీ మీద ఉన్న ధ్యాస రైతులపై లేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నియోజకవర్గంలో మొక్క జొన్న పంట కోతలు ప్రారంభమై, రైతులు సగం ధాన్యాన్ని అమ్ముకున్నాగాని ఈ అసమర్ధ ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2090 మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులకు రూ.18వందలకు, 19వందలకే అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు నష్టపోయిన రైతులెవరు నిరాశకు గురికావొద్దని ఇంకో రెండు నెలల్లో రాష్ట్రంలో బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వమంటే బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల్లో చేసి చూయించే ప్రభుత్వమన్నారు. అందుకే పసుపు బోర్డు హామీ ఇచ్చి నెరవేర్చామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రైతులు చాలా నష్టపోయారని ఎవరు కూడా దిగులు చెందవద్దని రాబోయేది రైతుల పక్షపాతి బిజెపి సర్కార్ అని, బిజెపి సర్కార్ వచ్చాక రైతులకు మేలుచేసే అనేక కొత్త పథకాలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. భారీ వర్షాల వల్ల సొయా పంట కూడా తీవ్రంగా నష్టపోయిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాకన్న ముందు రైతులు సొయా విత్తనాలను సహకార సంఘాలలో కొనుక్కునేవారని, కానీ ఈ అసమర్ధ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దళారులు విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు రైతులందరికి అమ్మడం వల్లనే సొయా పంట పూర్తిగా నష్టపోయి రైతులందరు తీవ్ర దుఃఖంలో ఉన్నారన్నారు. 2018 ఎన్నికల్లప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ మోర్తాడ్ సభలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతే వారిపైన పీడీ యాక్ట్ కింద కేసు బుక్ చేస్తామన్నారని, కానీ నకిలీ విత్తనాల వల్ల రైతులు ఇంత నష్టపోయిన ఎవ్వరికి ఒక్క రూపాయి నష్టపరిహారం కూడా అందించలేదని విమర్శించారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ విషయంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి గోడల మీద బిఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి అని పెయింటింగ్స్ వేయిస్తున్నాడని, కానీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందని ప్రశ్నించారు. ఇటీవల మంత్రి హరీష్ రావు సెప్టెంబర్ 15వ తేదీ కల్లా రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని మాట్లాడారని, ఎక్కడ ఏ రైతులకు లక్ష రుణమాఫీ అయిందో చూపెట్టాలన్నారు. ప్రజలకు సేవ చేసే తెలివి లేదు కానీ ప్రజలను ఓట్ల కోసం మభ్యపెట్టాలని చీరలు, హెల్మెట్లు, గడియారాలు పంచుతున్నారని విమర్శించారు.మంత్రి హోదాలో ఉండి నియోజకవర్గంలోని మహిళలను సిగ్గుండాలని దుశిస్తున్నాడని, అలా మాట్లాడుతున్న మంత్రికే సిగ్గు లేదన్నారు. అంతేకాకుండా మెండోరా గ్రామంలో “వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్” అని మంత్రి ప్రశాంత్ రెడ్డి మతిస్థిమితం లేని మాటలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మంత్రి మొఖం ఎవ్వరు కూడా చూడరన్నారు. మా ఎంపీ అర్వింద్ ధర్మపురి మాటల్లో చెప్పాలంటే మంత్రి మొఖం మీద నల్ల కాకి రెట్ట కూడా వేయదని వ్యంగంగా విమర్శించారు. నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పంచుతున్న చీరలు, హెల్మెట్లు, గడియారాలకు పెట్టె ఖర్చును, నష్టపోయిన రైతులకు ఇచ్చి ఉంటే రైతులకైనా ఎంతో కొంత లబ్ది చేకూరేదన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, బిజెపి సీనియర్ నాయకులు రెంజర్ల గంగారాం, మండల అధ్యక్షులు కట్ట సంజీవ్, ప్రధాన కార్యదర్శి రెంజర్ల గంగాధర్, ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి, చింత ప్రవీణ్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఫలహారం యాదగిరి, బీజేవైఎం అధ్యక్షులు కొత్తపల్లి అరుణ్, సోషల్ మీడియా కన్వీనర్ కమలాకర్, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కుంట భూమారెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు మల్లేష్ యాదవ్, చింత హన్మంతు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.