వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ షెడ్యూల్‌ ఇదే..వేర్వేరు గ్రూపుల్లో విండీస్‌, శ్రీలంక

న్యూఢిల్లీ : ఈ ఏడాది చివర్లో జరగబోయే వన్డే వరల్డ్‌ కప్‌ కోసం క్వాలిఫయర్స్‌ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ క్వాలిఫయర్స్‌ టోర్నీ జూన్‌ 18 నుంచి జులై 9 వరకూ జింబాబ్వేలో జరగనుంది. ఇందులో 10 టీమ్స్‌ పోటీ పడనున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విడదీశారు.
గ్రూప్‌-ఎలో వెస్టిండీస్‌, జింబాబ్వే, నెదర్లాండ్స్‌, నేపాల్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ), గ్రూప్‌-బిలో శ్రీలంక, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఒమన్‌, యూఏఈ ఉన్నాయి. గ్రూప్‌ స్టేజ్‌లో మొత్తం 20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత సూపర్‌ 6 స్టేజ్‌కు ఆరు జట్లు అర్హత సాధిస్తాయి. వీటిలో రెండు టీమ్స్‌ ఫైనల్‌కు చేరతాయి. ఇవే వరల్డ్‌ కప్‌ ప్రధాన టోర్నీకి వెళ్తాయి.
వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ తొలి మ్యాచ్‌ జూన్‌ 18న రెండుసార్లు ఛాంపియన్‌ వెస్టిండీస్‌, యూఎస్‌ఏ మధ్య జరుగుతుంది. ఇక జూన్‌ 19న మాజీ ఛాంపియన్‌ శ్రీలంక, యూఏఈ మధ్య జరగనుంది. ఇప్పటికే ఇండియా సహా 8 టీమ్స్‌ నేరుగా వరల్డ్‌ కప్‌ టోర్నీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఇండియాలో జరుగుతుంది. క్వాలిఫయర్స్‌ నుంచి రెండు టీమ్స్‌ వరల్డ్‌ కప్‌ ప్రధాన టోర్నీకి వెళ్లనుండటంతో మొత్తం పది జట్లు.. ఆ మెగా టోర్నీలో ట్రోఫీ కోసం తలపడతాయి. ఇప్పటికే ఇండియా, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. అయితే మాజీ ఛాంపియన్లు వెస్టిండీస్‌, శ్రీలంకల భవితవ్యం ఈ క్వాలిఫయర్స్‌లో తేలనుంది.