రైతుల పట్ల చైతన్యం లేదు..కార్యక్రమాలు లేవు !

– ప్రారంభానికి నోచుకోని మన తెలంగాణ-మన వ్యవసాయం
నవతెలంగాణ-మల్హర్‌రావు
పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్వహించే మన తెలంగాణ-మన వ్యవసాయం కార్యక్రమం నిలిచిపోయింది. సాగులో మేలకువలు, యంత్ర రాయితీ,పంటల బీమా తదితర అంశాలపై గతంలో సదస్సులు నిర్వహించేవారు. ఆరేళ్లుగా రైతులకు వ్యవసాయ అధికారులకు మధ్య దూరం పెరిగి వారికి సూచనలు, సలహాలు కరువైయ్యాయి.రైతులను సాగుకు సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం , మన తెలంగాణ-మన వ్యవసాయం, పేరిట రైతు చైతన్య యాత్రలు నిర్వహించేవారు.గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు కార్యక్రమ నిర్వహణకు బాధ్యత చేపట్టేవారు.
ఆధునిక పద్దతులపై అవగాహన కరువు
ఆధునిక పద్దతులపై అవగాహన లేకపోవడంతో వేసవి సాగులో ఓకేరకం పంట అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌,మే నెలల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతు చైతన్య యాత్రల పేరిట గ్రామాలకు వెళ్లి రైతులకు సాగులో మెలకువలపై అవగాహన కల్పించేవారు. అధికారులు బందాలుగా ఏర్పడి గ్రామాలకు వెళ్లి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అంశాల వారిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి రైతుల సంతకాలు సేకరించేవారు.ఇందులో భాగంగా భూసార పరీక్షలపై అవగాన, పంటల మార్పిడి, పంటలకు మద్దతు దరలేనప్పుడు ధాన్యం గోదాముల్లో నిల్వలు చేయడం దానిపై రుణం పొందే విధానం వర్షాభావ పరిస్థి తులకు అనుగుణంగా సాగు చేయాల్సిన పంటలు, రుణాల సద్వినియోగం, పంటలను ఆశించే చీడ,పిడల నివారణ, కరువు కోరల్లో చిక్కుకున్నప్పుడు పాడి పశువుల అభివద్ధి, పశు సంవర్ధక శాఖ రాయితీలు,విత్తనోత్పత్తికి ప్రోత్సాహం, విద్యుత్‌ వినియోగం తదితర విషయాలపై అధికారులు అవగాహన కల్పించేవారు. కానీ ప్రభుత్వం వాటి ఊసేలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతు వేదికలు నిర్మించినా…
ఏఈఓ కేంద్రంగా నిర్మించిన రైతువేదికలు నిరుప యోగంగా మారాయి. వాటిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. కానీ, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రైతుల యాత్రలు నిరంతరంగా సాగేవి. కానీ రైతు వేదికల్లో ఇవేమీ జరగడం లేదని, అన్ని శాఖల అధికారులు రావడం లేదని విమర్శలున్నాయి.