తీర్పులో కులమతాల ప్రస్తావన ఉండకూడదు : సుప్

న్యూఢిల్లీ : కోర్టు తీర్పుల్లో కులమతాల ప్రస్తావనే ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదు సంవత్సరాల బాలికపై లైంగిక దాడి చేసిన గౌతమ్‌ అనే వ్యక్తికి విధించిన శిక్షను తగ్గిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాజస్థాన్‌ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసింది. దీనిని విచారించిన సందర్భంగా న్యాయమూర్తులు అభరు ఎస్‌ ఓకా, పంకజ్‌ మిఠల్‌తో కూడిన బెంచ్‌ ఈ వ్యాఖ్య చేసింది. ట్రయల్‌ కోర్టు, రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో నేరస్తుడి కులాన్ని ఎందుకు ప్రస్తావించారని ధర్మాసనం ప్రశ్నించింది. ఏదైనా కేసును విచారించేట ప్పుడు నిందితుడు ఏ కులానికి లేదా ఏ మతానికి చెందినవాడన్న విషయాన్ని కోర్టు పట్టించుకోదని తెలిపింది. అలాంటప్పుడు ఈ కేసులో నిందితుడి కులాన్ని ఎందుకు ప్రస్తావించారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. తీర్పు ఇచ్చిన తర్వాత టైటిల్‌ నుండి కులా న్ని తొలగించేలా తీర్పులో సవరణలు చేస్తామని తెలిపింది. నిందితుడికి ట్రయల్‌ కోర్టు జీవిత ఖైదు విధించగా దానిని హైకోర్టు 12 సంవత్సరాలకు తగ్గించింది. నిందితుడి వయసు తక్కువగా ఉండడం, పేద ఎస్సీ కులానికి చెందినవాడు కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. పైగా నిందితుడు 2014 మే నుంచి జైలులోనే ఉన్నాడన్న విషయాన్నీ గమనంలోకి తీసుకుంది.