ఆలోచింపజేసే ఉక్కు సత్యాగ్రహం

సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టింది. ప్రజాగాయకుడు గద్దర్‌ కీలకపాత్ర పోషించిన ఈచిత్రం ద్వారా గాజువాక పల్సర్‌ బైక్‌ ఝాన్సీ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. వైజాగ్‌ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మేఘన, స్టీల్‌ ప్లాంట్‌ పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్‌, ఆదినారాయణ, వెంకట్రావు, ప్రసన్న కుమార్‌, కేయస్‌ఎన్‌రావ్‌, మీరా, పల్నాడుశ్రీనివాసరెడ్డి,రమణారెడ్డి, హనుమయ్య, అప్పికొండ అప్పారావ్‌, బాబాన్న, సింగ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి హీరో- దర్శకనిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ, ”ఆనాడు స్టీల్‌ప్లాంట్‌ సాధన కోసం జరిగిన పోరాటం, ఈనాడు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది, స్టీల్‌ ప్లాంట్‌ యూనియన్‌ లీడర్లు, ఉద్యోగులు, భూనిర్వాసితులు ఈ చిత్రంలో నటించటం ఒక విశేషం. రియాలిటీకి దగ్గరగా యువతరాన్ని ఆలోచింప చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. గద్దర్‌, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, సత్యారెడ్డి, మజ్జి దేవిశ్రీ అద్భుతమైన పాటలు రాశారు. శ్రీకోటి సంగీతం హైలైట్‌గా ఉంటుంది. త్వరలో ఆర్‌కె బీచ్‌లో ప్రీ రిలీజ్‌ వేడుకలు నిర్వహిస్తాం. ఓ ప్రముఖ వ్యక్తి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు’ అని చెప్పారు.