– లఖీంపూర్ ఖేరీ ఘటనపై కార్మిక, రైతు సంఘాల నిరసన
– కేంద్ర మంత్రి అజరు మిశ్రాను తొలగించాలని డిమాండ్
న్యూఢిల్లీ : 2021 అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరీలో రైతుల హత్యాకాండకు కేంద్ర మంత్రి అజరు మిశ్రా తెనీ కుట్ర పన్నారని పలు రైతు, కార్మిక సంఘాలు ఆరోపించాయి. మిశ్రాను తక్షణమే కేంద్ర మంత్రిమండలి నుండి తొలగించి, విచారించాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్తో మంగళ వారం దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటిస్తామని ప్రకటించాయి. సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాజధాని ఢిల్లీలో ఆగస్ట్ 24న అఖిలభారత సదస్సు జరిగింది. దీనికి అన్నదాతలు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సదస్సులోనే బ్లాక్ డే పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖీంపూర్ ఖేరీలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో క్రీడాకారులు వినియోగించే మూడు వాహనాలతో (ఎస్యూవీలు) వచ్చిన వ్యక్తులు వాటిని రైతుల పైకి నడిపించారు. ఈ ఘటనలో నక్షత్ర సింగ్, గుర్వీందర్ సింగ్, లవ్ప్రీత్ సింగ్, దల్జీత్ సింగ్ అనే రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వాహనాలలో ఒకటి కేంద్ర మంత్రి మిశ్రాకు చెందినది. వీటిలో ఒక దానిని మిశ్రా కుమారుడు అశిష్ నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయాన్ని కార్పొరేటీకరించాలన్న దురుద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనను అణచివేసేందుకు బీజేపీ పన్నిన ఎత్తుగడల్లో ఈ సంఘటన కూడా ఒక భాగమని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు, ఎస్కేఎం సమన్వయ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ విమర్శించారు.