– అదనపు ఎన్నికల ప్రధానాధికారి ఎల్. లోకేష్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల సన్నాహక చర్యల్లో భాగంగా ఎన్నికల విధులు నిర్వర్తించే ఈవీఎం నోడల్ అధికారులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిబ్బందికి మంగళవారం ఎన్నికల ప్రధాన కార్యాలయంలో శిక్షణా శిబిరాన్ని నిర్వహించినట్టు అదనపు ఎన్నికల ప్రధానాధికారి ఎల్. లోకేష్ కుమార్ తెలిపారు.ఈవీఎంలు, వీవీపాట్ యంత్రాల నిర్వహణ, సాంకేతిక విషయాలు, ఓటింగుకు ముందు, ఓటింగ్ సమయంలో, ఓటింగ్ పూర్తి అయిన తరువాత వాటిని నిర్వహించే పద్ధతులు, ప్రక్రియలపై సీనియర్ అధికారులతోపాటు, ఓటింగ్ యంత్రాల తయారీ సంస్థ అయిన ఈసీఐఎల్ కు చెందిన ఇంజనీర్లు సుకంఠ కుమార్ భోళా, కె. నితిన్ కుమార్ లు సిబ్బందికి అవగాహన కల్పించారని పేర్కొన్నారు. సీలు తీసే సమయంలో, వేసిన తరువాత ఓటింగ్ యంత్రాల నిర్వహణ, భద్రత, కౌంటింగ్ లపై కూడా సిబ్బందికి ఆచరణాత్మకంగా వివరించినట్టు తెలిపారు.