ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఊహించని ట్విస్ట్‌

– వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్న రామచంద్ర పిళ్ళై
– సిసోడియాపై రిమాండ్‌ కోర్టులో విచారణ
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత విచారణ నేడు (శనివారం) జరగాల్సి ఉంది. అయితే అరుణ్‌ రామచంద్ర పిళ్లై శుక్రవారం ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఇప్పటికే అరుణ్‌ రామచంద్ర పిళ్లై అరెస్ట్‌ అయ్యారు. ఆయన శుక్రవారం ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ కోర్టులో దరఖాస్తు చేశారు. పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు.. ఈడీకి నోటీసులు పంపించింది. శనివారం రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఆధారంగానే కవితను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతున్నది. నిజానికి 9న ఆమెను విచారించాల్సి ఉంది. అయితే ఆమె ముందుగానే ఖరారైన షెడ్యూల్‌ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. 11న విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు. ఈ నేపథ్యంలో అరుణ్‌ రామచంద్ర పిళ్లై ట్విస్ట్‌ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పిళ్లై తన వాంగ్మూలంలో తను కవిత బినామీనని చెప్పారు. అలాగే ఆమె చెప్పినందునే తన ఖాతాలోకి రూ.32 కోట్లు వచ్చాయని ఈడీకి తెలిపారు. అలాగే కోటి రూపాయలు సైతం ఆయన సొంత అకౌంట్‌లో పడ్డాయి. అలాగే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సౌత్‌ గ్రూప్‌నకు 32.5 శాతం వాటాలున్నాయి. వీటిలో సైతం కవితకు వాటాలందాయని ఈడీ చెబుతోంది. రేపు కవితను అరుణ్‌ రామచంద్ర పిళ్లై సమక్షంలోనే విచారించనున్నారు.
మనిశ్‌ సిసోడియాకు వారం రోజులు కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు మరో వారం రోజుల ఈడీ కస్టడి పొడిగించింది. అంతకు ముందు సిసోడియాను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో ఈడీ కోరింది. ఇప్పటివరకూ ఆయన సీబీఐ రిమాండ్‌లో ఉన్నారు. సీబీఐ రిమాండ్‌పై విచారణ ఇప్పటికే ఈనెల 21కి వాయిదా పడగా తాజాగా న్యాయస్థానం ఆయనను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. మనీశ్‌ సిసోడియాతో పాటు కలిపి విచారించేందుకు ఇప్పటికే ఏడుగురికి నోటీసులు జారీ చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తెలిపారు.