శ్రీమతి డా|| కందేపీ రాణీప్రసాద్ బాల సాహితీవేత్త. ఇద్దరు పుత్రులకు తల్లిగా, సృజన్చిల్డ్రన్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసు. పిల్లల మనస్థత్వం తెలుసు. సృజనయే మూల వస్తువుగా అనుక్షణం పరితపించే రాణీప్రసాద్ ‘వెల్త్ ఫ్రం వేస్ట్’ అన్న నానుడిని గాఢంగా విశ్వసిస్తారు. ఆచరిస్తారు. వాడిపారేసిన ఇంజక్షన్ సీసాల మూతలు, కాయలు, ఆకులు, మిరియాలు, లవంగాలు, శంకుపూల కాయలు, విత్తులు, వేరుశనగ, పిస్తా తొక్కలు, పెడిగ్రీ (కుక్క) ఫుడ్, చెగోడీ, వాడిన చేమంతి పూలు, ఎక్స్పైరీ మందులు, వడియాలు, అట్టముక్కలు, తళుకులు, చివరకు గులకరా్లు కూడా వీరి చేతిలో ప్రాణం పోసుకుని అపురూప వస్తువులవుతాయి. క్షణం కూడా తీరికగా కూర్చుండలేని వీరికి కరోనా వరమయింది. నాలుగు గోడలమధ్య, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరుస్తూ ఈగ, దోమ, చీమ, ఆవు, పిచ్చుక, కుందేలు, పావురం, రామచిలుక, మేక, లేడి, గుర్రం లాంటి ప్రాణుల్ని సృష్టించి, వాటిని అలాగే వదిలేయక ప్రస్తుత పుస్తకాన్ని మన ముందుకు తెచ్చారు. ఈగ, దోమ, చీమ బొమ్మలు తయారు చేసి ఈ పుస్తకంలో ఆయా ప్రాణులు, కీటకాలు, జంతువుల గురించిన వివరాలు ఇచ్చారు. వాటి శాస్త్రీయనామం, వాటి ఆహార అలవాట్లు, అవి మానవ జాతికి కలిగించే మంచి చెడులను వివరించడం… చాలా మంచిపని చేశారనిపిస్తుంది. ఇందువల్ల పిల్లలకు కళలయందు ప్రావీణ్యత కలగడమే కాకుండా, వీటి గురించి ఎంతో ఆసక్తి కలిగించే సమాచారం ఇవ్వడం చాలా బాగుంది. ప్రపంచాన్ని లోగడ కరోనా లాగే భయపెట్టిన ప్లేగు, కలరా, ఫ్లూ, ఎయిడ ఇంతే కాదు, ఆయా ప్రాణులు సమాజంలో, సాహిత్యంలో వాటి పాత్రలను వివరించి పాఠకులకు ఆసక్తి పెంచటంలో కృతకృత్యులయ్యారు. ఈ పుస్తకాన్ని చదివాక పిచ్చుకల దినం మార్చి 30 అని తెలుసుకుంటాం. విలియం బ్లేక్ ఈగల గురించి రాసిన కవిత్వం ‘ద ఫ్లై’ అని తెలుస్తుంది.
విజ్ఞానం, కళా వినోదం అందరికీ అందాలన్నది వీరి తాపత్రయం. వందకు వంద శాతం సఫలీకృతమయింది.
‘మృగయాపురి’లోని ఈ ప్రాణులను సృష్టించిన తీరు, కొత్తదనం ఆకట్టుకుంటుంది. పిల్లల్లో సృజనశక్తి పెంచుతుంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా కందేపీరాణీ ప్రసాద్ సృష్టించిన ఈ అద్భుత ప్రపంచానికి జేజేలు పలుకుతారు.
మృగయాపురి
వివిధ వస్తువులతో జంతువుల
బొమ్మలు, వ్యాసాలు.
రచన : డా||కందేపీ రాణీప్రసాద్,
పేజీలు : , వెల : 150/-
ప్రతులకు : సృజన చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల – 505301,
ఫోన్ : 9866160378.
– కూర చిదంబరం, 8639338675