భారత్‌లోని ఎంబసీలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం : ఆఫ్ఘనిస్తాన్‌

న్యూఢిల్లీ : భారత్‌లోని తమ దౌత్య కార్యాలయంలో ఆదివారం నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ఆఫ్ఘనిస్తాన్‌ వెల్లడించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ రాయబార కార్యాలయంలో ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి కార్యకలాపాలను నిలిపివేసే నిర్ణయాన్ని ప్రకటించినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపింది. భారత్‌ ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోవడంతో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌, భారత్‌ల మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను, దీర్ఘకాల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఈ నిర్ణయం తీవ్ర విచారకరం అని రాయబార కార్యాలయం తెలిపింది.