కేసీఆర్‌ ఉండగా..

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీకి చోటే లేదు
– మంత్రి ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్‌
అభివద్దిని మరిచి మతాలు, దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ పట్ల యావత్‌ దేశ ప్రజలు విసుగు చెందారని చెప్పడానికి కర్నాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ను తిరస్కరించి కర్నాటక ప్రజలు బీజేపీకి చెంపదెబ్బలాంటి తీర్పునిచ్చారని అన్నారు. బీజేపీ 40% కమీషన్‌ అవినీతి పాలన ఓ వైపు అయితే, మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ..దేశ సంపద అంతా మోడీ దోస్త్‌ అదానీకి ధారాదత్తం చేయడంతో ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. అక్రమంగా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాలను కూలుస్తూ నీచాతినీచ రాజకీయాలకు ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టి, దేశ భద్రతనే గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అసమర్థ, అవినీతి పాలన వల్ల సీిలిండర్‌ ధర, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు అరిగోస పడుతున్నారని వివరించారు. కర్నాటకలో గెలుపు చూసి తెలంగాణలో ఏమో పొడుస్తామని రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నాడనీ, అది వాపు చూసి బలుపు అనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కేసిఆర్‌ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తప్పా..ఇప్పటికే తెలంగాణ ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్‌, బీజేపీకి చోటు లేదన్నారు. దమ్ముంటే మొదలు బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి చూపాలని మంత్రి వేముల సవాల్‌ చేశారు.