కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ చేస్తున్న అన్యాయాలపై ఎందుకు మాట్లాడటం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయరో సమాధానం చెప్పాలన్నారు. గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్‌ వేదికగా మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘మెడికల్‌ కాలేజీల విషయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం. రాష్ట్రానికి మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలని పలు మార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్‌ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క మెడికల్‌ కాలేజీని తెలంగాణకు ఇవ్వకుండా మొండి చేయి చూపింది. ఒకటో దశ, రెండో దశలో ఇవ్వలేదు. మూడో దశలో ఇస్తామని చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్‌ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను ప్రదర్శించింది. పైగా మెడికల్‌ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే, మరొకరు కరీంనగర్‌, ఖమ్మంలో మెడికల్‌ కాలేజ్‌ కోసం అడిగిందనీ, అక్కడ ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేకపోయాం అని చెబుతారు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు.? కేంద్రం మెడికల్‌ కాలేజీ ఇవ్వకున్నా, పైసా నిధులు మంజూరు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో 12 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించింది. ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌ సీట్లతో రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ 1గా ఉండటం వాస్తవం కాదా? .. ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్‌ ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనస్సు రానివారు ఇలా పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా?, గతంలో బీబీనగర్‌ ఎయిమ్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని ఒక కేంద్ర మంత్రి నాలుక కరుచుకున్నరు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదు. ఇప్పుడు మెడికల్‌ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు, ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌ స్థాయిలో ఉండాల్సిన బీబీనగర్‌ ఎయిమ్స్‌, ఎందుకు గల్లీ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో కూడా లేదు? ఎందుకు అధ్వాన్నంగా ఉంది? రూ.1,365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా, ఎందుకు రూ. 156 కోట్లు (11.4 శాతం) మాత్రమే మంజూరు చేశారు? 2018 లో మంజూరైన గుజరాత్‌ ఎయిమ్స్‌కి 52 శాతం నిధులు ఇచ్చింది వాస్తవం కాదా? …’ అని హరీశ్‌ రావు ప్రశ్నలు వేశారు.
ఏపీ పునర్‌ విభజన చట్టం -2014 లో ఇచ్చిన హామీల మేరకు ట్రైబల్‌ యూనివర్సిటీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్‌భవన్‌ దృష్టి పెడితే రాష్ట్ర ప్రజలకు గొప్ప మేలు చేసిన వారవుతారని మంత్రి సూచించారు.