– ఐఐఎస్సీ చర్యను ప్రశ్నించిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు
– డైరెక్టర్కు 500మందికి పైగా ప్రముఖుల లేఖ
న్యూఢిల్లీ : నిరంకుశమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ)పై చర్చను నిలిపివేయా లని నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) డైరెక్టర్ గోవందన్ రంగరాజన్కు 500మందికి పైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ప్రముఖులు లేఖ రాశారు. ”అక్రమ కార్యకలాపాలు నిరోధక చట్టం, జైళ్ళు, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ” అన్న శీర్షికతో జూన్ 28న నటాషా నర్వాల్, దేవాంగన కలితల నేతృత్వంలో ఈ చర్చ జరగాల్సి వుంది. నర్వాల్, కలితలు విద్యార్ధి కార్యకర్తలు, ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో వారిని నిందితులుగా పేర్కొన్న ఢిల్లీ పోలీసులు యుఎపిఎ కింద కేసు పెట్టారు. కానీ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (సీసీఈ )లో జూన్ 27వ తేదీన జరగాల్సిన ఆ చర్చా కార్యక్రమాన్ని ఐఐఎస్సీ రిజిస్ట్రార్ అర్ధంతరంగా రద్దు చేశారు. దాంతో సర్వామ్ కాంప్లెక్స్ వెలుపల ఇష్టాగోష్టి నిర్వహించాలని విద్యార్ధులైన ఆ నిర్వాహకులు నిర్ణయించారు. కానీ వారిని చెదరగొట్టేందుకు భద్రతా బృందాలు వచ్చాయి. చివరకు ఫ్యాకల్టీ సభ్యులు జోక్యం చేసుకోవడంతో భద్రతా బృందాలు వెనక్కి మళ్ళాయి. నర్వాల్, కలితలకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు, అసమ్మతిని అణచివేసే ఆతృతలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగపరంగా సంక్రమించిన నిరసనల హక్కుకు, తీవ్రవాద కార్యకలాపాలకు మధ్య గల రేఖను చెరిపేసిందని వ్యాఖ్యానించింది. అటువంటి చర్యలు మరిన్ని జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్యానించిందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. నర్వాల్, కలితల అనుభవం వినడం ఐఐఎస్సీ సభ్యులకు ముఖ్యమైనదని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇతరుల దృక్పథంతో సంబంధం లేకుండా ఇటువంటి చర్చలు జరగడం ప్రజాస్వామ్యంలో చాలా కీలకమని అన్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రశ్నలపై శాంతియుతంగా జరిగే చర్చలనే అనుమతించడానికి సంస్థ విముఖంగా వున్నట్లైతే ఇక శాస్త్రీయ దృక్పథానికి అవసరమైన కీలక విచారణా స్ఫూర్తిని ఎలా అమలు చేయగలరని వారు ఆ లేఖలో ప్రశ్నించారు. చర్చను రద్దు చేయడం ద్వారా ఐఐఎస్సీ పేరు ప్రతిష్టలను పాలనా విభాగం దెబ్బ తీసిందన్నారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని వారు ఆ లేఖలో కోరారు.