జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్ష బాధ్యతలు

– చైనా పార్లమెంట్‌ ఆమోదముద్ర
న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. మరో ఐదేండ్లపాటు జిన్‌పింగ్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్‌ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. గతేడాది అక్టోబరులో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో 69ఏండ్ల జిన్‌పింగ్‌ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. సీపీసీ వ్యవస్థాపకుడు మావో తర్వాత మూడోసారి పార్టీ పగ్గాలు అందుకున్న తొలినేతగా జిన్‌పింగ్‌ ఘనత సాధించారు. మొత్తం 2950మందికిపైగా సభ్యులు జిన్‌పింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక తర్వాత జిన్‌పింగ్‌ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. హన్‌ జెంగ్‌ను దేశ ఉపాధ్యక్షుడిగా పార్లమెంట్‌ ఎన్నుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు తెచ్చుకున్న ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’కి నాయకత్వం వహించే ‘కేంద్ర మిలటరీ కమిషన్‌’ చైర్మెన్‌గా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఎన్నుకుంటూ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ శుక్రవారం తీర్మానించింది.