నవతెలంగాణ – ఇరాక్: పెండ్లి మండపంలో అగ్నిప్రమాదం 100 మంది మృతి ఉత్తర ఇరాక్లో తీరని విషాదం నెలకొంది. ఓ పెండ్లి మండపంలో అగ్నిప్రమాదం సంభవించి 100 మంది మృతి చెందారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నినేవే ప్రావిన్స్లో క్రైస్తవుల ప్రాబల్యం ఉన్న హమ్దానియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెడ్డింగ్హాల్లో మంటలు ఎగసిపడుతున్న వీడియోలు ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ కనిపించాయి. హాల్ మొత్తాన్ని మంటలు కాల్చి బూడిద కుప్పగా మార్చేశాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ దురదృష్టకర ఘటన బారినపడిన వారికి సహాయ కార్యక్రమాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపారు. ప్రధానమంత్రి మహమ్మద్ షియా అల్ సుడానీ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు అధికారికంగా తెలియనప్పటికీ కుర్దిష్ టెలివిజన్ న్యూస్ చానల్ మాత్రం బాణసంచా కారణంగానే ప్రమాదం సంభవించినట్టు పేర్కొంది.