నవతెలంగాణ-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1022 ఎకరాల భూమిని హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం సేకరణ ఉత్తర్వుల అమలును యథాతథంగా (స్టేటస్కో) ఉంచాలని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నంది వనపర్తి, సింగారం గ్రామాల్లోని దేవాలయ శాఖకు చెందిన 1022 ఎకరాలను ఫార్మా సిటీకి ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ఇండిస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) గతంలో సింగిల్ జడ్జి నుంచి అనుమతి పొందించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అదే గ్రామానికి చెందిన భక్తులు జంగయ్య, దేవోజీ దాఖలు చేసిన అప్పీల్ను మంగళవారం జస్టిస్ వినోద్కుమార్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ, టీఎస్ఐఐసీ, ఆలయ కమిటీలను ఆదేశించింది. విచారణను జులైకి వాయిదా వేసింది.