నవతెలంగాణ – శాయంపేట: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన 14వ విడత సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం ఉదయం 10 గంటల నుండి రాత్రి పది గంటల వరకు కొనసాగింది. సామాజిక తనిఖీ బృందం విచారణలో వెల్లడించిన నివేదికల ఆధారంగా 16,762 రూపాయల జరిమానా విధించినట్లు డి ఆర్ డి ఓ ఏపీడి రవి తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్లకు 10,916 రూపాయల జరిమానా విధించగా, ఈసీ కి 318, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు 5,528 రూపాయల జరిమానా విధించినట్లు ఏపీడి తెలిపారు. ఉపాధి సిబ్బంది విధుల పట్ల అశ్రద్ధ కనిపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుందని, పనిలో మార్పు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.