నవతెలంగాణ – తమిళనాడు: కోయంబేడు మార్కెట్లో ఉల్లి ధర పేద, మధ్యతరగతి ప్రజలకు అందలేనంతగా పెరుగుతోంది. గురువారం ఆ మార్కెట్లో కేజీ పెద్ద ఉల్లి రూ.75లకు విక్రయించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉల్లి పంట కోత జాప్యం కావటంతో ఆ రాష్టం నుంచి అవసరమైనంత ఉల్లి కోయంబేడు మార్కెట్కు దిగుమతి కావటం లేదని, ఆ కారణంగా ఉల్లి ధర రూ.75లకు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. కోయంబేడు మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు రూ.75లకు విక్రయిస్తుండగా, చిల్లర వ్యాపారులు రూ.90లకు అమ్ముతుండటంతో నగరవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారానికి ఐదు కేజీల చొప్పున కొనేవారంతా ప్రస్తుతం పావు, అర కేజీ చొప్పున కొనుగోలు చేస్తున్నారు. గురువారం కోయంబేడు మార్కెట్లో కేజీ చిన్న ఉల్లిపాయలు రూ.90లకు విక్రయిస్తుండగా, చిల్లర మార్కెట్లలో రూ.120లకు విక్రయిస్తున్నారు.