నవతెలంగాణ -పుదుచ్చేరి: ఆడబిడ్డల కోసం అద్భుతమైన పథకాన్ని ప్రవేశ పెట్టింది పుదుచ్చేరి ప్రభుత్వం. ఆడపిల్లను కంటే వారి పేరిట బ్యాంకు ఖాతా తెరచి అందుకలో రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మార్చి 17న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం రంగస్వామి ఈ ప్రకటన చేశారు. బాలికా శిశు రక్షణ పథకం కింద ఈ డబ్బు జమ చేస్తారు. కనీసం ఇలాగైనా భ్రూణ హత్యలు ఆగుతాయని ఆయన ఆకాంక్షించారు. ఆడపిల్లపై వివక్ష తగ్గుతుందన్నారు. ఇక ఈ పథకం ప్రకటించిన తరువాత జన్మించిన 38 మంది ఆడ శిశువులకు బ్యాంకు ఖాతా తెరచి అందులో రూ.50 వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను వారి తల్లికి అందజేశారు. ఇక దీనితో పాటు మహిళలకు అనేక పథకాలను అందిస్తుంది పుదుచ్చేరి ప్రభుత్వం. పేద మహిళలకు నెల నెలా రూ.1000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఇటీవలే మరికొంతమందికి కొత్తగా ఆర్థిక సాయం అందించారు. వారికి గుర్తింపు కార్డులను అందించారు సీఎం రంగస్వామి. దాదాపు 1600 మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు. ఇప్పటికే 13వేలమంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇక ఆడపిల్లల ఖాతాలో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని తిలాసుకోట్టైలోని సీఎం నివాసంలో రంగస్వామి ప్రారంభించారు.