నవతెలంగాణ-హైదరాబాద్ : చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ తొలుత 199 పరుగులకు ఆలౌట్ అయింది. 200 పరుగుల లక్ష్యఛేదన ఆరంభంలో టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఓటమి దిశగా పయనిస్తున్నట్టు అనిపించింది. అయితే, టీమిండియాను విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జోడీ ఆదుకుంది. ఆరంభంలో కోహ్లీ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను మిచెల్ మార్ష్ జారవిడవడం బాగా ప్రభావం చూపింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ జోడీ భారత్ ను సురక్షితమైన స్థితికి చేర్చింది. కొత్త బంతితో నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు ఆ తర్వాత ప్రభావం చూపలేకపోయారు. కోహ్లీ 85 పరుగులు చేయగా కెఎల్ రాహుల్ 97 పరుగులతో నాటౌట్ గా నిలిచి చివరిలో సిక్స్ తో జట్టు స్కోరు 201 పరుగులు చేయడంతో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 3, స్టార్క్ 1 వికెట్ తీశారు.