– శ్రీనగర్ కాలనీలో వెళ్లి విరుస్తున్న ఆనందాలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మా దళిత బిడ్డ పోలీస్ కానిస్టేబుల్ అయ్యాడంటూ మండలంలోని శ్రీనగర్ దళిత కాలనీకి చెందిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో గ్రామానికి చెందిన పొడుతూరి వర ప్రసాద్ పోలీస్ గా అర్హత సాధించడంతో గ్రామంలో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. గ్రామానికి చెందిన పొడుతూరి వెంకటేశ్వర్లు, గోపమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా వీరిని తల్లిదండ్రులు కూలి నాలి పనులు చేసుకుంటూ ఉన్నతంగా చదివించారు. వరప్రసాద్ చిన్ననాటి నుండి తన తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత చదువులు చదువుతూ క్రమశిక్షణతో మెలిగేవాడు. గ్రామంలో మొట్టమొదటిసారిగా పోలీస్ ఉద్యోగ సాధించిన వరప్రసాద్ ను తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు, యువకులు అభినందించడంతోపాటు దళిత యువకుడికి పోలీసు ఉద్యోగం వచ్చిందంటూ గర్వపడుతున్నారు. ప్రతి దళిత బిడ్డ వరప్రసాద్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. పోలీసు ఉద్యోగం సాధించిన వరప్రసాద్ ను పలువురు అభినందించారు.