నవతెలంగాణ హైదరాబాద్: కేసిఆర్ మానసపుత్రికైన కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజి 20వ పిల్లర్ కుంగుబాటుపై సమగ్ర విచారణ జరిపించాలి. నాణ్యతా లోపాల వల్ల నష్టం, తదితర వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేయాలని, డ్యాం సేఫ్టీ అధికారుల నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటి డిమాండ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు 48 పిల్లర్లతో నిర్మాణం చేయడం జరిగింది. ప్రారంభించిన మూడు సంవత్సరాలలోనే రికార్డు స్ధాయిలో నిర్మాణం పూర్తిచేసి దేశంలోనే ప్రతిష్టను స్వంతం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.5లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడమే కాకుండా మరో 17లక్షల పాత ఆయకట్టును స్ధిరీకరించడానికి ప్రణాళిక రూపొందించారు.
ప్రాజెక్టు నిర్మాణం జరిగిన సంతోషం మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. ప్రాజెక్టు పూర్తయిన రెండు సంవత్సరాలకు గోదావరికి వరదలు రావడంతో ఇదేబ్యారేజి లోని 7పంపులు నీట మునిగాయి. వాటి రిపేర్లు, నష్టం ఎవరు భరించాలన్న మీమాంస ముందుకొచ్చింది. ఆ సంఘటన మర్చిపోక ముందే మూడో సంవత్సరం వరదలు తగ్గిన తర్వాత 18 నుండి 21 వరకు గల బ్యారేజి పిల్లర్లు అడుగున్నర లోతు కుంగిపోయాయి. వీటితో పాటు వివిధ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఇపుడిపుడే వెలుగులోకి వస్తున్నాయి. పగుళ్లు, లీజేకిలు, పెచ్చులూడటం వంటివి కన్పిస్తున్నాయి. నాలుగేళ్ల నుండి 8 ఏళ్లలోపు నిర్మాణం చేసిన ప్రాజెక్టులకు నాణ్యతా లోపాలు వెలుగజూస్తుండటం ఆందోళనకరం. బ్యారేజి పూర్తికాగానే తెలంగాణ నుండి మహారాష్ట్రకు బ్యారేజి పై నుండి భారీ వాహనాలు సహా రాకపోకలు సాగించారు. ప్రస్తుతం నిల్పివేశారు.
సహజంగా ప్రతి బ్యారేజిపై రవాణాను నిషేధించినా, కాళేశ్వరం నుండి రవాణాను అనుమతించారు. పిల్లర్ ఒకవైపు కుంగిన తర్వాత భయంతో ప్రభుత్వం 10.6 టియంసిల నిల్వ వున్న నీటిని మొత్తం బయటకు పంపించారు. యాసంగిలో ప్రాజెక్టులోని నీటిని వినియోగించుకోలేని పరిస్థితి వచ్చింది. మొత్తం నీరు వినియోగంలోకి రాకుండానే నిర్మాణ లోపాలు బహిర్గతమయ్యాయి. ఇంత భారీ స్ధాయిలో బ్యారేజికి నష్టం జరిగినా ఇప్పటివరకు ప్రభుత్వం నుండి గానీ, ఇంజనీర్లు వైపు నుండి గానీ వాస్తవాలు బైట పెట్టడం లేదు. మొత్తం ప్రాజెక్టు పూర్తి కాకముందే జరిగిన భారీ నష్టంపై సమగ్రమైన విచారణ జరిపి, వాస్తవాలను తెలియజేయడంతో పాటు నష్టానికి బాధ్యులు ఎవరో ప్రకటించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.