నవతెలంగాణ హైదరాబాద్: బదిలీ అయిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.లక్ష్మణ్, జస్టిస్ జి.అనుపమా చక్రవర్తిలకు సోమవారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ ఎం.లక్ష్మణ్ రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ అనుపమా చక్రవర్తి పాట్నా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే నేతృత్వంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు మొదటి కోర్టు హాలులో వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్లు మాట్లాడుతూ, బదిలీ అయిన ఇరువురు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థకు అందించిన సేవలను కొనియాడారు. ఎన్నో చరిత్రాత్మక తీర్పులను వెలువరించారని పేర్కొన్నారు. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ అనుపమా చక్రవర్తిలు మాట్లాడుతూ తమకు సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి.ప్రవీణ్కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ ఇద్దరు న్యాయమూర్తులను ఘనంగా సన్మానించింది.