నవతెలంగాణ కోల్కతా: 2024 సార్వత్రిక ఎన్నికల (Elections 2024) కంటే ముందే విపక్ష నేతలందర్నీ అరెస్టు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నుతోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. 2న కేజ్రీవాల్(Arvind Kejriwal)ను అరెస్టు చేస్తారు! ‘వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే… విపక్ష పార్టీల గళాన్ని అణచివేయాలని వారు (బీజేపీ) ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ముందు ప్రతిపక్ష నేతలందర్నీ అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా వాళ్లకు వాళ్లే ఓట్లు వేసుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం వారు కుట్ర పన్నుతున్నారు’ అని కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ ఆరోపించారు.
ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వచ్చే పెండింగు నిధులను నవంబర్ 16లోగా విడుదల చేయకుంటే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని దీదీ హెచ్చరించారు. తొలుత నవంబర్ 1 వరకే డెడ్లైన్ విధించినప్పటికీ.. గవర్నర్ హామీ మేరకు కొన్ని రోజులు వేచి చూస్తామన్నారు. ఇండియా కూటమి నేతలే లక్ష్యంగా.. వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా (INDIA) కూటమి నేతలను అరెస్టు చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆమ్ఆద్మీ పార్టీ (AAP) ఆరోపించింది. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్దే తొలి అరెస్టు కానుందని మరోసారి పేర్కొంది. నవంబర్ 2న ఆప్ అధినేత కేజ్రీవాల్.. ఈడీ ముందు హాజరు కానున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇలా స్పందించింది.
‘విపక్షాల కూటమి ఇండియా (INDIA) ఏర్పాటుతో బీజేపీ ఉలిక్కిపడింది. దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో 95శాతం విపక్ష నేతలమీదే ఉన్నాయి. కూటమిలో కీలక నేతలనే భాజపా లక్ష్యంగా చేసుకుందనే విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో తొలి అరెస్టు అరవింద్ కేజ్రీవాల్దే కానుంది’ అని ఆప్ నేత రాఘవ్ చద్దా పేర్కొన్నారు. కేజ్రీవాల్ తర్వాత ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీలను అరెస్టు చేస్తారని రాఘవ్ చద్దా అంచనా వేశారు. అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ కీలక నేతలను అరెస్టు చేయనున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఏడు లోక్సభ స్థానాల్లో ఓడిపోనున్నట్టు బీజేపీ గ్రహించిందని.. అందుకే ఆప్ను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేసేందుకే బీజేపీ కుట్ర పన్నిందన్నారు.