– లక్షల్లో నోట్ల కట్టలు
జైపూర్: ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన లాకర్లలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి, లక్షల్లో డబ్బులు కనుగొన్నారు. మరో లాకర్లో భారీ సంఖ్యలో నోట్ల కట్టలతో ఉన్న సంచిని గుర్తించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ ద్వారా సంపాదించిన అక్రమ ధనాన్ని జైపూర్లోని గణపతి ప్లాజాలోని ప్రైవేట్ లాకర్లలో ఉంచారని బిజెపి ఎంపి కిరోరి లాల్ మీనా గత నెలలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో గణపతి ప్లాజాలో ఉన్న సుమారు 1,100 లాకర్లపై ఐటీ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. గత నెల 17న మూడు లాకర్ల నుంచి సుమారు రూ.30 లక్షలు, గత నెల 21న మరికొన్ని లాకర్ల నుంచి రూ.2.46 కోట్ల నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.గతేడాది డిసెంబర్లో గ్రేడ్ 2 టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ అయ్యింది. దీంతో ఆ పరీక్షను రాజస్థాన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పేపర్ లీక్ కేసుకు సంబంధించి 37 మంది అభ్యర్థులు సహా 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.60 లక్షలకు పేపర్ను లీక్ చేసినట్లు విచారణలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు బాబులాల్ కటారా అంగీకరించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది.