న్యూఢిల్లీ: రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులకు శుక్రవారం స్వల్ప ఊరట కలిగింది. ఢిల్లీతో సహ నోయిడా, గురుగ్రామ్, ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఓ మోస్తారు వాన పడింది. దీంతో ఇక్కడి వాతావరణంలో కొంత మార్పుకు దారితీసింది. గాలిలో ఉన్న విషపూరిత వాయులు కొంత వరకు క్లీన్ అయ్యాయి. గాలి నాణ్యత సూచి కూడా స్పల్పంగా మెరుగుపడింది.
శుక్రవారం ఉదయంనాటికి ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ 408కి తగ్గింది. గురువారం సాయంత్రం ఇది 437గా నమోదైంది. శుక్రవారం కూడా కర్తవ్య పథ్, ఐటిఐ, ఢిల్లీ-నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షం కురిసింది. కాగా, ఢిల్లీ, ఎన్సిఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో గత వారం రోజులుగా కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాయు కాలుష్యం పెరగడం, గాలి నాణ్యత సూచీ పడిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏడేళ్ళ తర్వాత కాలుష్యం దెబ్బతో స్కూళ్ళు మూతబడ్డాయి. ఇప్పటికే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రవేశ పెట్టారు. దట్టమైన పొగ నిండిన రోడ్లతో, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ, ముక్కులకు మాస్కులు తగిలించుకొని సాహసించి జనం బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది.
ఢిల్లీ సమీపంలోని రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు, వాహనాల నుంచి వెలవడే పొగ ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణకు ఈ నెల 13 నుంచి సరి – బేసి విధానం పాటిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు, గాలి నాణ్యతను పెంచేందుకు కృత్రిమ వర్షం కురిపించాలనే ఆలోచన కూడా చేసింది. ఈ నల 20 నుంచి 21 వరకు రెండు రోజుల పాటు ఢిల్లీలో ఈ కృత్రిమ వర్షం కురిపించాలని నిర్ణయించింది. అయితే ఈలోగానే వర్షాలు కురుస్తుండటం ప్రజలు, ప్రభుత్వానికి కాస్త ఉపశమనం లభించినట్లైంది.