– మాంజీ సంచలన ఆరోపణలు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తినే ఆహారంలో విషం కలుపుతున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్ జితన్ రాం మాంజీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కారణంతోనే నితీష్ మానసిక ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి పీఠం కోసమే ఈ పనిచేస్తున్నారని మాంజీ పేర్కొన్నారు. పాట్నా అసెంబ్లీ బయట శుక్రవారం మాంజీ ఈ ఆరోపణలు చేశారు. మానసిక ఆరోగ్యం క్షీణించడం వల్లే నితీష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తరువాత మళ్లీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు. అంతేగాక పెద్దవాన్ని అని చూడకుండా అసెంబ్లీలో తనను కూడా నితీష్ తిట్టారని మాంజీ తెలిపారు.నితీష్ కుమార్కు ఇస్తున ఆహారంపై ఉన్నతస్థాయి విచారణ చేయాల్సిందిగా గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేస్తానని మాంజీ ఈ సందర్భంగా తెలిపారు.అలాగే రాష్ట్రంలో కొన్ని రోజులుగా నెలకొన్న దారుణ పరిస్థితులపైనా వివరిస్తాని తెలిపారు. ఇటీవలే రిజర్వేషన్లు పెంచుతూ బీహార్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుపై డౌట్లు లేవనెత్తినందుకుగాను మాంజీపై అసెంబ్లీలో సీఎం నితీష్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..