– కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్ తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు
గాంధీనగర్ : ప్రధాని మోడీ విద్యార్హతలకు సంబంధించిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. మార్చి 31న కేజ్రీవాల్కు మోదీ డిగ్రీలకు సంబంధించిన వివరాలను అందించాలని గుజరాత్ యూనివర్సిటీని కోరుతూ కేంద్ర సమాచార కమిషన్ 2016లో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. సమాచార హక్కు చట్టం ప్రకారం ఒకరి ”బాధ్యతా రహితమైన చిన్నపిల్లల ఉత్సుకత” ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదిగా భావించలేమని గుజరాత్ విశ్వవిద్యాలయం హైకోర్టులో ఈ ఉత్తర్వును వ్యతిరేకించింది. యూనివర్శిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మార్చిలో ప్రధాని డిగ్రీలకు సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉన్నందున దాచడానికి ఏమీ లేదని తెలిపారు. అయితే, యూనివర్సిటీ వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేయబడలేదనీ, ఆఫీస్ రిజిస్టర్ అని సూచించబడిన పత్రం మాత్రమే ప్రదర్శించబడుతుందని కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్ వాదించిందని వివరించారు. మోడీకి 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ లభించిందని బీజేపీ అంటున్నది.