– మావోయిస్టుల హింస నియంత్రణపై ప్రధాని విరుద్ధ ప్రకటనలు
– వెల్లడిస్తున్న ప్రభుత్వ గణాంకాలు
– కాంగ్రెస్ పాలన కంటే బీజేపీ పాలనలోనే హింస అధికం
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఉగ్రవాదం, మావోయిస్టు హింసాత్మక సంఘటనలు పెరుగుతాయని ఆరోపించారు. మావోయిస్టుల హింసను అరికట్టడంలో ఆ పార్టీ విఫలమైందని అన్నారు. అయితే, ఛత్తీస్గఢ్ విషయంలో కేంద్ర గణాంకాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. కేంద్రం గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో మావోయిస్టుల హింస తగ్గింది. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హౌం మంత్రి అమిత్ షా మాత్రం ఆ క్రెడిట్ను తన పార్టీకి ఇచ్చుకున్నారు.
కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. 2010 నుంచి లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం (ఎల్డబ్ల్యూఈ) చేత చంపబడిన పౌరుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పౌర మరణాలు గత కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా తగ్గాయి, 2010లో 722 నుంచి 2022లో 82కి పడిపోయాయి. ఆర్థిక మౌలిక సదుపాయాలపై దాడుల పరంగా 2010 నుంచి సంఘటనలు లేదా దాడుల సంఖ్య కూడా తగ్గింది. దాడులు 2010లో 365 నుంచి 2021, 2022లో వరుసగా 42కి తగ్గాయి. రాజ్యసభలో కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2018 నుంచి ఎల్డబ్ల్యూఈ సంఘటనలు, మరణాలు క్రమంగా తగ్గాయి. 2018లో ఎల్డబ్ల్యూఈ ఘటనలు 833గా ఉండగా.. మరణాలు 240గా నమోదయ్యాయి. 2023 జులై నాటికి ఎల్డబ్ల్యూఈ ఘటనలు 273కు.. మరణాలు 79కి పడిపోవటం గమనార్హం.
ఛత్తీస్గఢ్ విషయంలో చూసుకుంటే.. 2018 వరకు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. 2018 ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎల్డబ్ల్యూఈ ద్వారా హింసాత్మక ఘటనలు, భద్రతా దళాలతో ప్రారంభించబడిన సంఘటనలు, భద్రతా సిబ్బంది, పౌరుల, ఎల్డబ్ల్యూఈ మరణాలు 2018 నుంచి తగ్గుముఖం పట్టాయి. 2018లో ఎల్డబ్ల్యూఈ హింసాత్మక ఘటనలు 275గా ఉన్నాయి. భద్రతా సిబ్బంది 55 మంది, పౌరులు 98 మంది, ఎల్డబ్ల్యూఈ వ్యక్తుఉల 125 మంది మరణించారు. అది 2023 ఫిబ్రవరి 28 నాటికి ఎల్డబ్ల్యూఈ హింసాత్మక ఘటనలు 37కు పడిపోయాయి. భద్రతా సిబ్బంది ఏడుగురు, పౌరులు పది మంది మాత్రమే మరణించారు.
ఛత్తీస్గఢ్లో 2018కి ముందు బీజేపీ పాలనలో ఉన్న పరిస్థితితో పోల్చుకుంటే.. ప్రస్తుత ఐదేండ్ల కాంగ్రెస్ పాలనలో మావోయిస్టు హింసాత్మక ఘటనలు, పౌరుల మరణాలు తగ్గాయి. అయితే, మోడీ మాత్రం ఈ విషయంలో కాంగ్రెస్పై ఆరోపణలు చేయటం గమనార్హం. మోడీ చేసిన విరుద్ధ ప్రకటనలు కేవలం రాజకీయంగా లబ్ది పొందటానికి చేసినవేననీ, సాక్షాత్తూ కేంద్ర గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.