– బిల్లుల విషయంలో ఆలస్యం చేయొద్దు
– గవర్నర్ల తీరు ఆందోళనకరం
– సుప్రీం ధర్మాసనం ఆగ్రహం
– కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు
– విచారణ 20కి వాయిదా
న్యూఢిల్లీ : నిప్పుతో ఆటలాడొద్దని గవర్నర్లను అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. తమిళనాడు, పంజాబ్ గవర్నర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు చేస్తున్న జాప్యంపై పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రజలెన్నుకున్న నేతల ద్వారా అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుల విషయంలో ఆలస్యం చేయొద్దని ఇరు రాష్ట్రాల గవర్నర్లను హెచ్చరించింది. బిల్లులపై గవర్నర్ల తీరు తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని ధర్మాసనం పేర్కొంది. పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ”మీరు నిప్పుతో ఆడుకుంటున్నారు. సమావేశాలు సక్రమంగా జరగలేదన్న కారణంతో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు చెల్లవని గవర్నర్ ఎలా చెబుతారు. పంజాబ్లో గవర్నర్, ప్రభుత్వం మధ్య జరుగుతున్న పరిణామాలపై మేం సంతృప్తికరంగా లేం. ఇలాంటి చర్యలతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యన్ని కొనసాగిస్తామా? ఇది చాలా తీవ్రమైన విషయం” అని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశం స్థిరపడిన సంప్రదాయాలపై నడుస్తున్నదనీ, వాటిని అనుసరించాల్సిన అవరసం ఉందని నొక్కి చెప్పింది.
తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 12 బిల్లులకు ఆమోదం తెలిపేందుకు నిరాకరించిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్రం లేవనెత్తిన అంశాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయనీ, ఆర్టికల్ 200 కింద గవర్నర్కు 12 బిల్లులు పంపిస్తే ఒక్కదానిపైనా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ల సహాయాన్ని కూడా కోర్టు కోరింది.
గవర్నర్ల ప్రవర్తన రాజ్యంగ విరుద్ధం: అభిషేక్ మను సింఘ్వీ
పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాల తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. బిల్లులపై చర్య తీసుకోవడానికి గవర్నర్లు నిరాకరించే ధోరణి ఇప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ల సమస్య పంజాబ్ నుంచి తమిళనాడుకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి విస్తరిస్తోన్న వ్యాధి అని, దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. గవర్నర్ల ప్రవర్తన రాజ్యంగ విరుద్ధమనీ, వారి చర్యలు ప్రభుత్వ పాలనపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ”దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ సంతకం చేయటం లేదు. రిమిషన్ ఆర్డర్లకు సంబంధించిన బిల్లుపైనా సంతకం చేయడం లేదు. ప్రాసిక్యూషన్ లేదా రిమిషన్ కోసం శాంక్షన్ ఇవ్వాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం అనే లేఖ ఇక్కడ ఉంది. జైలులో ప్రజలు ఉన్నారు. ఏదో ఒకటి చేయాలి” అని సింఘ్వీ అన్నారు. సింఘ్వీతో పాటు తమిళనాడు తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, పి. విల్సన్ కూడా హాజరయ్యారు.అనంతరం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తీసుకున్న చర్యల వివరాలను తమకు అందజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఆదేశించింది. కేసును దీపావళి తరువాత సోమవారం (నవంబర్ 20) విచారిస్తామని చెబుతూ వాయిదా వేసింది.
డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య, పంజాబ్లో ఆప్ ప్రభుత్వానికి గవర్నర్ పురోహిత్కి మధ్య ఇటీవలి కాలంలో విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పాస్ చేయడంలో గవర్నర్లు ఉద్దేశ్యపూర్వకంగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు నవంబర్ 6న ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్లకు ఆత్మపరిశీలన అవసరమని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం తమ వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది కీలక బిల్లులకు ఆమోదం తెలిపేలా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ కూడా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేరళకు చెందిన ఇలాంటి పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కేరళ దాఖలు చేసిన పిటిషన్లను కూడా ఈ నెల 20న విచారించనుంది.